Wednesday, 2 November 2022

భ్రూణ హత్యలతో నేరస్తులుగా మిగలకండి : సమాజానికి జిల్లా జడ్జి.. కలేక్టర్ల హితవు


ఖమ్మం, నవంబర్ 2: వివాహాలు స్వర్గంలో జరుగుతాయని, వరకట్న అగ్గితో ఆడవారిని దహించవద్దని, భ్రూణ హత్యలకు పాల్పడి నేరస్తులుగా మిగలకండి అని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి డా. టి. శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లు సమాజానికి హితవు పలికారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో వరకట్నం, భ్రూణ హత్యలపై రూపొందించిన బ్యానర్లను వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వధువు వైపు వారి నుండి ఏదీ ఆశించవద్దని, అది నిన్ను దహించివేస్తుందని అన్నారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని వారు తెలిపారు. శిశువును గర్భంలోనే తుంచవద్దని, ప్రపంచాన్ని చూడనివ్వాలని, భ్రూణ హత్యలు ఆపాలని, ఆడపిల్లలను కాపాడాలని వారు అన్నారు. ప్రజల్లో అవగాహన కలిగి, చైతన్యం కొరకు బ్యానర్లను కలెక్టరేట్, జిల్లా కార్యాలయాల్లో ప్రదర్శించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment