Tuesday, 30 June 2026

కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోండి : నవతరెడ్డి డిమాండ్

*కబ్జాదారుల గుప్పిట్లో 50 కోట్ల CMC(GHMC) బల్దియా భూమి!*

 *శేరిలింగంపల్లి చందానగర్‌లో 4 వేల గజాల  స్థలం ఆక్రమణ*

 *అడ్డగోలుగా ప్రహరీ కూల్చి ఆక్రమించిన CMC అధికారుల మొద్దునిద్ర*

 *బి ఆర్ ఎస్ ప్రభుత్యం హయాంలో మహిళా భవనం కు,ఫంక్షన్ హాల్ కోసం భూమి  కేటాయిస్తే  కాంగ్రెస్ ప్రభుత్యలో  కబ్జాదారుల పాలు*

 *కలెక్టర్ ఇచ్చిన అధికారిక పత్రంలు ఇచ్చిన  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సీఎంసీ యంత్రాంగం*

 *ప్రజాప్రతినిధి అండతో మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ద్యాజం*

 *తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే మహిళలతో కలిసి  న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక*

*చందానగర్:*
మహిళమణుల  అవసరాల కోసం కేటాయించిన సుమారు 50 కోట్ల విలువైన CMC భూమి కబ్జాదారుల పాలవుతున్నా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధి అండతో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ బాగోతం మున్సిపల్ అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. సొంత భూమిని రక్షించుకోవడంలో విఫలమైన అధికారుల తీరుపై చందానగర్ మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్ కు,గత 2 సంవత్సరాలుగా పిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదు అని  ఉన్నతాధికారులకు ఈ రోజు  ఆమె ఘాటైన లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేశారు.చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 210లో సుమారు 4 వేల గజాల స్థలం ఉంది. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. ఈ స్థలంలో మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018 (మార్చి 7న), 2019 (మే 5న) ప్రొసీడింగ్స్ (LC1/3076/2016) ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. దీని ప్రకారం 2019లోనే కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించి, గేటు కూడా ఏర్పాటు చేశారు. అయితే, కబ్జాదారులు 2022 ఆగస్టు 10న, 2024 ఫిబ్రవరి 9న దౌర్జన్యంగా ఆ ప్రహరీని కూల్చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు చోద్యం చూశారే తప్ప చర్యలు తీసుకోలేదు.

స్థలం ఆక్రమణకు గురవుతుండటంపై మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారు. అది మాది కాదు  ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలను జతచేసి.. 2024లో అప్పటి డెప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. 2025 నవంబర్‌లో సైతం జోనల్ కమిషనర్‌కు మరోసారి వినతిపత్రం ఇచ్చారు. అయినా ఉన్నతాధికారుల్లో ఉలుకూ పలుకూ లేదు.మున్సిపల్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకున్న కొందరు, అదే స్థలంలో టీజీఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెరతీశారు. దీనిపై నవతారెడ్డి ఆర్టీఐ ద్వారా విద్యుత్ శాఖను వివరణ కోరగా.. ఆ భూమికి సంబంధించి తమ వద్ద ఎలాంటి అధికారిక కేటాయింపు పత్రాలు లేవని,ప్రజాప్రతినిధుల సూచనతో నిర్మాణం చేశామని  సమాధానమిచ్చారు. ఇదే విషయమై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీయగా.. తాము విద్యుత్ శాఖకు  హెచ్ఎంసీ యాక్ట్ యూ బై ఎస్  635 కింద నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించి,ఎలాంటి అనుమతులు లేకుండా స్థలంలో పత్రాలు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే నోటీసులు ఇచ్చి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా జీహెచ్ఎంసీ/సీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.50 కోట్ల ప్రజా ధనాన్ని కబ్జాదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ప్రకారం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మించాలి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి తక్షణమే అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున మహిళ పోరాటం, న్యాయ పోరాటం చేస్తామని బొబ్బ నవతారెడ్డి హెచ్చరించారు.

ఆవేదన అంచుల నుండి ఆనందపు తీరాలకు.. ఇది ఓ నిహారిక కధ

కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేసుకున్నవి కావు… దేవుడు మన కోసం ముందే రాసిపెట్టినవి… ❤️🙏🏻

ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చూశాను…
అప్పుడప్పుడు నటించాను…
సినిమాల కోసం పని చేశాను…

కానీ ఈ రోజు…
సెన్సార్ బోర్డు మెంబర్‌గా నా మొదటి సినిమా చూసిన రోజు. 🎬

సినిమా పూర్తయ్యాక…
చర్చలు జరిగాయి…
సంతకాలు చేసి బయటికి వచ్చిన ఆ కొన్ని నిమిషాలు…
నా కాళ్లు ముందుకు నడుస్తున్నాయి…
కానీ నా మనసు మాత్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది.

“అసలు ఇదంతా నేనేనా…?” అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు…
చేతిలో ఏమీ లేదు…
Inter కూడా పూర్తి చేయలేక మధ్యలోనే ఆగిపోయాను.
ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు…
జీవితం నెట్టుకొస్తే చాలు…
అనుకున్న ఒక సాధారణ అమ్మాయి.

కానీ…
దేవుడు రాసిన కథ వేరేలా ఉంది.

రెండేళ్లకే అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను…
పెళ్లి తర్వాత ఇక సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను…
కానీ జీవితానికి మన ప్లాన్ల కంటే దేవుడి ప్లాన్ ఎప్పుడూ గొప్పదే.

మళ్లీ సినిమాల్లోకి వచ్చాను…
పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేశాను…
అమ్మ కలను నా కలగా మార్చుకొని Niharika Design Studio ప్రారంభించాను.
కరోనా సమయంలో మీ అందరి ప్రేమ, సహకారంతో  Foundation ద్వారా ఎంతోమంది జీవితాల్లో చిన్న వెలుగుగా నిలిచే అవకాశం వచ్చింది.

ఈ ప్రయాణంలో…
“ఇంకో అడుగు కూడా వేయలేను… నా వల్ల కాదు…”
అని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.

“ఇక బ్రతకడం ఎందుకు…”
అనే ఆలోచన కూడా ఎన్నోసార్లు వచ్చింది.

కానీ…
ఈ రోజు…
ఆ ఆలోచన కూడా నన్ను తాకలేని స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు.

అవును…
ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను…
కొన్నిసార్లు మళ్లీ బలహీనపడుతాను…
మళ్లీ లేస్తాను…

ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక విషయం బాగా తెలుసు…

దేవుడు ఆలస్యం చేయవచ్చు… కానీ మన జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి సరైన సమయాన్నే ఎంచుకుంటాడు. ❤️

ఈ రోజు నాకు ఈ సినిమా ఇంకో కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకం…

చిన్నప్పటి నుంచీ నేను ఎంతో అభిమానించే నా Real Hero సినిమా…
అదే సినిమాను సెన్సార్ బోర్డు మెంబర్‌గా చూసే అదృష్టం రావడం…
నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. 🎥✨

కొన్ని స్థానాలు…
కొన్ని అవకాశాలు…
మనమే వెతికి సంపాదించేవి కావు…

దేవుడు పిలిచి… “ఇది నీ సమయం” అని ఇచ్చేవి.

ఈ అవకాశం కూడా నాకు అలాంటిదే.

 ఈ నమ్మకం ఉంచి…
ఈ బాధ్యతకు నన్ను గుర్తించి, నా పేరును సూచించి, ఈ అవకాశం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻

భగవాన్… కామాక్షి అమ్మ…
మీ ప్రేమ…
మీ కృప…
మీ ఆశీర్వాదం లేకుండా నా జీవితంలో ఏదీ సాధ్యం కాదు.

Everything I am… Everything I have… is only because of Your unconditional love. ❤️🙏🏻

అంతా మీ కృప… మీ ఆశీర్వాదమే… 🙏🏻

#GratitudeAlways #BlessedJourney #CensorBoardMember #DivineGrace #DreamsDoComeTrue ❤️🙏🏻

Friday, 19 June 2026

*ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*


*ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*ప్రతి ఓటరు వివరాలను సమగ్రంగా పరిశీలించాలి*

*ప్రతి ఇంటికి బీఎల్‌వో చేరుకొని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి*

*డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి అభ్యంతరాలు, క్లెయిమ్‌లపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలి*

*రఘునాథపాలెం మండలం కేంద్రంలో ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమం ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
----------------------------------------------------------------
ఖమ్మం : ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కు ప్రజలందరూ తమ పూర్తి వివరాలతో స్వచ్చందంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.శుక్రవారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కలెక్టర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బీఎల్‌ఓల పని తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకత తో పని చేయాలన్నారు. ఎస్ఐఆర్ లో భాగమైన మండలాలు, కార్పోరేషన్, మున్సిపాలిటీ సంబంధించి ప్రతి ఓటర్లను మ్యాపింగ్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకొని వంద శాతానికి చేరుకోవాలన్నారు. 
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జులై 25 వరకు చేపట్టనున్నారన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి, రికార్డులను నవీకరించాలని తెలిపారు.
 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం, ఎన్నికల సిబ్బంది విధులు, పౌరుల భాగస్వామ్యం, ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావడానికి సహకరించాలని అధికారులు కృషి చేయాలన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చి, అనర్హులైన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్ ఎంట్రీలతొలగింపు జరుగుతుందని తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హమైన ఓటరుని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్‌ నిబంధనలు, విధి విధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వివరాలు, కావాల్సిన దృవీకరణలు బూత్ స్థాయి అధికారి సందర్శన సందర్భంగా సిద్ధం గా ఉంచాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
*ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం చేయాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి*
-------------------------------------------------------------------
ఖమ్మం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం, ఫారం పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, పట్టణాలలో మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ విభాగాలుగా సమాచారాన్ని విభజించి సవరణ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు సమావేశాలు నిర్వహించి సంబంధిత ఫోటోలు, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు స్థానిక భాషలో ముద్రించబడతాయని, బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్లకు అందజేయబడిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లు క్షేత్రస్థాయిలో తరచుగా పర్యటించి సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించాలని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, మ్యాపింగ్ చేయబడని ఓటర్ల వివరాలను అప్డేట్ ఆప్షన్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. జూలై 24వ తేదీ లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయడం జరుగుతుందని, జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కరణ, అక్టోబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 1 వేయి 200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంబంధించిన బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని, బూత్ స్థాయి అధికారులకు వృద్ధ, అనారోగ్య, దివ్యాంగ ఓటర్ల నమోదు విషయంపై ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. ఒకే కుటుంబం సంబంధించిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించాలని, తప్పుడు ప్రచారాన్ని నిరోధించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక  సమగ్ర సవరణ కార్యక్రమం పురస్కరించుకొని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు. బూత్ స్థాయి అధికారులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై జిల్లాలో బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 
జిల్లాకు ప్రచార సామాగ్రి, బూత్ స్థాయి అధికారుల కిట్లు చేరినట్లు అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల పూర్తి, ఏ ఏ దృవీకరణలు తీసుకోవాలో బూత్ స్థాయి అధికారులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం ఏ. రాజు, డిటి అన్సారీ, ఎన్నికల విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------
Powered by : 
 MANIKUMAR KOMMAMURU
📲: 9032075966

Wednesday, 17 June 2026

ఏపీపీకి కమిషనర్ అభినందన


*అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అభినంధించిన పోలీస్ కమిషనర్*

చిన్నారులపై లైంగిక వేధింపులు పోక్సో కేసుల్లో, గంజాయి వంటి తీవ్రమైన NDPS కేసుల్లో బలమైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడం, ప్రాసిక్యూషన్, పోలీసుల సమన్వయంతో నేరం రుజువు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ... నేరస్థులకు జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష మొదలు అనేక కఠిన కారాగారా శిక్షలు పడేలా కృషి చేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన ఐదు పోక్సో కేసుల్లో ఖమ్మం అర్బన్ కేసు లో నిందుతుడికి జీవిత ఖైదు, రఘునాథపాలెం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష, ఖమ్మం రూరల్ రెండు వేర్వేరు కేసులో ఏడు, ఐదు సంవత్సరాల జైలు,రఘునాథపాలెం కేసులో మూడు సంవత్సరాల ఆరు నెలల శిక్ష పడ్డాయి.అదేవిదంగా గంజాయి వంటి 10 NDPS కేసుల్లో ఆరు కేసుల్లో 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష, మరో రెండు కేసుల్లో 10 ఏళ్ల జైలు, ఒక కేసులో ఏడు ఏళ్ల జైలు, రెండు కేసుల్లో ఏడాది వరకు జైలు శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ అభినందించారు.

Tuesday, 16 June 2026

నరరూప రాక్షసుని కఠినంగా శిక్షించండి : బుడిగం శ్రీనివాస్

*ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన  గౌస్ ను ఉరితీయాలి : మాజీ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు                                                                      ...ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మానవ మృగాన్ని వెంటనే ఉరితీయాలి*                                    *కార్పొరేట్ వైద్యం పూర్తిస్థాయిలో ఉచితంగా అందించాలి..*                                                   *.. మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా  అందించాలి*                                         ఖమ్మం జూన్ 16. ఖమ్మం లో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యయత్నం చేసిన మానవ మృగం గౌస్ ను తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ పాషా ను వెంటనే ఉరితీయాలనీ కోరుతూ, మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం "నిరసన ర్యాలీ" నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్, వాకార్స్ సంఘం మాజీ అధ్యక్షులు బుడిగం శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ ను ఉరి తీయాలనీ అయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుండి వైరా రోడ్ సిగ్నల్ పాయింట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాకం శ్యామ్ బాబు, విజయ్, దామోదర్ రెడ్డి, రామనాధం, నరసింహారావు, సుదర్శన్, జక్కుల వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, వీరబాబు, గంధం కోటేశ్వరరావు, మాదవి, సంధ్య, కిరన్మయి, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Thursday, 11 June 2026

సమాచార హక్కు వారదులు వీరే...

పోరాటంతో సాధించలేనిది ఏదీ లేదు అన్నది జగద్విదితం. ఈముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005, Right to Information Act
వీరిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి #అరుణారాయ్ IAS అధికారిణి..తన ఉద్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి Right to Information, Right to Work, Right to Food మొదలగు కార్యక్రమాల ద్వారా పేదల తరుపున తన గొంతు వినిపించడంలో ముందున్నారు. 
ఎడమవైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి #శంకరసింగ్. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి ఆర్టీఐ కార్యకర్తగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.
కుడివైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి #నిఖిల్ #డే. వీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నినందించాలని తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి వచ్చిన వ్యక్తి. ఆర్టీఐ (RTI) ద్వారా ఎన్నో ప్రశ్నలు సంధించడమే కాకుండా,  ఎలా దానిని ఉపయోగించుకోవాలో ప్రజలకు శిక్షణ ఇస్తూ ఉంటారు.
ఈ ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (Mazdoor Kisan Shakti Sangathan - MKSS) అనే సంస్థ ప్రారంభించి సాగించిన ఉద్యమ ఫలితమే సమాచార హక్కు చట్టం. 

*చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలి : బిఆర్ ఎస్ నేత తాజుద్దీన్,


*12 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.*

నేరం చేసిన వ్యక్తిని నిందితుడు అంటారు. నేరం చేసిన వ్యక్తి పేరు, మతం, కులం చూసి చట్టం పని చేయదు. *భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమే. అందుకే నిందితుడు గౌస్ అయినా, బండి సంజయ్ కుమారుడైనా, మరెవ్వరైనా — నేరం చేస్తే ఒకటే చట్టం, ఒకటే శిక్ష ఉండాలి.*
ఈ దారుణాన్ని యావత్ ముస్లిం సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటనను ఏ మతం, ఏ సంస్కృతి, ఏ మానవత్వం కూడా సమర్థించదు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనను మతానికి ముడిపెట్టి విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్టకరం.

ముస్లిం సమాజం ఎప్పుడూ నేరస్థుడిని అతని మతం చూసి సమర్థించదు. నేరం చేసినవాడు ఎవడైనా శిక్ష పడాలనే వైఖరినే అనుసరిస్తుంది. అందుకే నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ముస్లిం సమాజం మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.

ఇక్కడ మరో విషయం కూడా సమాజం గుర్తించాలి. నెల క్రితం జరిగిన ఇలాంటి ఘటనల్లో నిందితులపై వేగంగా, కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే, నేడు మరో గౌస్ లాంటి నిందితుడు ఇలాంటి దారుణానికి పాల్పడే ధైర్యం చేసి ఉండకపోవచ్చు. చట్టం ఆలస్యం కాకుండా కఠినంగా అమలు కావడం సమాజ రక్షణకు అత్యవసరం.

అలాగే నిందితుడిని కాపాడేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న ముగ్గురు ప్రముఖుల కులం కూడా నిందితుడి కులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఈ వ్యవహారాన్ని కులం లేదా మతం కోణంలో చూడడం ఎంత తప్పో స్పష్టమవుతుంది. కొందరి వ్యక్తిగత చర్యలను మొత్తం సమాజానికి ఆపాదించడం బాధ్యతారాహిత్యం.

అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలకు కులం లేదు, మతం లేదు. బాధితుడి కన్నీటికి మతం ఉండదు. నిందితుడి నేరానికి కులం ఉండదు. కాబట్టి నేరాన్ని ఖండిద్దాం, నిందితుడికి శిక్ష కోరుదాం. కానీ సమాజంలో విద్వేషం, కుల-మత రాజకీయాలకు మాత్రం తావివ్వకూడదు.

సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ న్యాయం పక్షాన నిలబడాలి. నేరస్థుడికి శిక్ష, బాధితురాలికి న్యాయం, సమాజానికి సామరస్యం — ఇదే మనందరి లక్ష్యం కావాలి.

*ఇట్లు,*
*మహమ్మద్ తాజుద్దీన్*
*బీఆర్ఎస్ పార్టీ మాజీ ముస్లిం మైనారిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు*

Wednesday, 10 June 2026

బసవతారకంలో చిన్నారుల మధ్య బాలకృష్ణ బర్త్ డే


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో 22 జూన్ న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నాం – శ్రీ నందమూరి బాలకృష్ణ

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకొన్న శ్రీ నందమూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రిసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం జూన్ 22 న సాయంత్రం హైటెక్ సిటీలోని నొవాటెల్ హోటల్ లో నిర్వహిస్తున్నామని శ్రీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.  బుధవారం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ కార్యక్రమాలను వివరించారు. 
 2000 వ సంవత్సరములో ప్రారంభమైన సంస్థ 25 సంవత్సరములు పూర్తి చేసుకొని ముందుకు సాగుతోందని ప్రస్థానాన్ని వివరించారు.  స్వర్గీయ నందమూరి తారకరామారావు, శ్రీమతి బసవతారకం ల‌ ఆశయాల మేరకు నడపడం జరుగుతోందని అంటూ గత సంవత్సర కాలంగా రజతోత్సవ వేళ పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.  
ఈ రజతోత్సవ కార్యక్రమాల ముగింపు ఈ నెల 22 న నిర్వహించబోయే భారీ కార్యక్రమంతో ముగుస్తుందని వివరించారు.  ఈ కార్యక్రమానికి శ్రీ జె పి నడ్డా,  కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులతో పాటూ శ్రీ వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి - శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు విశిష్ట అతిదులుగా హాజరుకానున్నారని తెలిపారు.  వీరితో పాటూ కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ, ఆంద్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ లు హాజరుకానున్నారని శ్రీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.  
ఈ కార్యక్రమం ద్వారా 25 సంవత్సరముల గడిచిన కాలాన్ని అవలోకనం చేసుకొంటూ భవిష్యత్తులో హైదరాబాదు హాస్పిటల్ వద్ద నిర్మించనున్న సరికొత్త నార్త్ బ్లాక్ మరియు అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మించనున్న హాస్పిటల్ ను అనుకొన్న గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.  ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్మాణంతో పాటూ నడపడానికి గత 25 సంవత్సరములుగా సహకరించిన వారందరినీ గుర్తుకుతెచ్చుకొని వారి స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.  లభాపేక్ష లేకుండా సంస్థ నిర్వహించడం జరుగుతోందని, భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
 సమావేశానికి ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలలో  నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సంస్థ సిబ్బంది ఏర్పాటు చేసిన  కేక్ ను కట్ చేసి వారితో పంచుకొన్నారు.  అనంతరం చిన్నారులకు బొమ్మలు మరియు ఇతర బహుమతులు అందజేశారు.  అనంతరం హైదరాబాదుకు చెందిన  సీతారామారాజు హాస్పిటల్ కు అందించిన లక్షరూపాయాల విరాళాన్ని స్వీకరించారు.  తర్వాత త్రివేణి, కృష్ణవేణి స్కూల్లకు చెందిన విద్యార్థీ, విద్యార్థిణులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరించిన లక్షా వెయ్యి నూట పదహారు రూపాయాల విరాళాలాన్ని యాజమాన్యం, పిల్లలు కలసి నందమూరి బాలకృష్ణకు అందజేశారు.  పిమ్మట అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మాణమవుతున్న నూతన హాస్పిటల్ నిర్మాణానికి  కాకర్ల రాఘవేంద్ర రావు అందించిన పది లక్షల రూపాయాల విరాళాన్ని చెక్కు రూపంలో స్వీకరించారు.  ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా చిన్నారులు చేస్తున్న మంచి పనిని ప్రశంసించారు.  పుట్టిన రోజులు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ రానున్న రోజులలో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు భగవంతుడు అవకాశమివ్వాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాలలో  డా. టి సుబ్రహ్మణ్యేశ్వర రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాధ్, ఆసోసియేట్ డైరెక్టర్ – అకడమిక్స్, BIACH&RI మరియు పలువురు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Saturday, 6 June 2026

మరణంలోనూ మనసులు పెనవేసుకొని...

 ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఉన్న ‘ది ఫ్లోరిష్ స్టే’ బి&బిలోని కింది అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిలో, బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ఒక పురుషుడు మరియు ఒక మహిళ చివరిసారిగా గుండెను పిండేసేలా కౌగిలించుకుని గడ్డకట్టిన స్థితిలో విగతజీవులుగా పడి ఉన్నారు. వీరు ఆఫ్రికా దేశస్తులుగా గుర్తించారు.

ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉంది, ఆమె పక్కనే కుర్చీలో కూర్చున్న పురుషుడు ఆమెను గట్టిగా పట్టుకుని, ఆమె తలను అతని భుజంపై సున్నితంగా ఆనించి ఉన్నాడు. ఐదు అంతస్తుల ఆ భవనంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మంటల నుండి తప్పించుకోవాలనే ఆశతో వారు బహుశా తమను తాము స్నానాల గదిలో బంధించుకున్నారు.

"వారు అగ్నిప్రమాదంలో చనిపోలేదు. పొగ వల్ల చనిపోయారు," అని మండుతున్న భవనం నుండి అతిథులను ఖాళీ చేయించడంలో సహాయపడటానికి ముందుకు వచ్చిన స్థానిక వాలంటీర్లలో ఒకరైన మహమ్మద్ షోయబ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

"మేము కింది అంతస్తుకు వెళ్లి, లోపలి నుండి తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిని చూశాము," అని షోయబ్ గుర్తుచేసుకున్నారు.  మేము తలుపులు పగలగొట్టి చూడగా, ఒక జంట ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ఉన్నారు. వారు అప్పటికే మరణించారు. ఆ మహిళ ఒక కుండపై కూర్చొని ఉండగా, ఆమె పక్కనే ఉన్న కుర్చీలో పురుషుడు ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవాలనే ఆశతో వారు తమను తాము లోపల బంధించుకున్నట్లు అనిపించింది. మేము వారిని కౌగిలింతలో బంధించి ఉండగా కనుగొన్నాము.

బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో చెలరేగిన ఈ అగ్నిప్రమాదం, బేస్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు. ఆ భవనానికి అగ్నిప్రమాద నిరభ్యంతర పత్రం (NOC) లేదని, కిటికీలు మూసి ఉన్నాయని, మరియు కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 25 గదులను అక్రమంగా నిర్వహిస్తున్నారని దర్యాప్తు అధికారులు తరువాత వెల్లడించారు.

Thursday, 4 June 2026

*చెట్టు పై నుండి నోట్ల వర్షం కురిపించిన వానరం..*


*ఉత్తర ప్రదేశ్:*
*బులంద్ షహర్ కోర్టు పనిమీద వచ్చిన ఓ వ్యక్తికి కోతి చుక్కలు చూపించింది.నగదుతో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లి చెట్టుమీద నుంచి నోట్ల వర్షం కురిపించింది.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.జిల్లా కేంద్రంలోని కోర్టుకు వచ్చిన వచ్చిన రవీంద్ర,ఆయన సహచరుడు ఆమిర్ స్టాంప్ పేపర్లు కొందామని వెళుతుండగా హఠాత్తుగా వచ్చిన వానరం బ్యాగును అపహరించుకుపోయింది.రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగుతో అక్కడే ఉన్న ఓ చెట్టెక్కి కూర్చుంది.బ్యాగు మొత్తం చింపేయడంతో నోట్ల వర్షం కురిసింది.దీంతో స్థానికులు చెట్టుకింద పడిన నోట్లను సేకరించి తిరిగి రవీంద్రకు అప్పగించారు.*

పొంగుతున్న బీరు... ప్రభుత్వానికి భారీ ఆదాయం

*ఎండల ఎఫెక్ట్..* *తెలంగాణలో బీర్ల విక్రయాల జోరు!* 

*రెండు నెలల్లో 14 కోట్ల బీర్లు అమ్మకం.. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం* 

హైదరాబాద్, జూన్ 4 :
తెలంగాణలో మండిపోతున్న ఎండలు బీర్ల అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల విక్రయాలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 4 కోట్ల బీర్లు అదనంగా అమ్ముడవగా, మొత్తం విక్రయాలు 14 కోట్లకు చేరినట్లు సమాచారం.

ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల వినియోగం అత్యధికంగా నమోదైంది. సాధారణ రోజుల్లో 1.5 లక్షల కేసుల వరకు ఉండే అమ్మకాలు, ఎండల తీవ్రత కారణంగా రోజుకు 2.2 లక్షల కేసులకు పెరిగినట్లు తెలుస్తోంది.

బీర్ల విక్రయాలు పెరగడంతో ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం కూడా భారీగా సమకూరుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మద్యం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ.10 వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది నాలుగు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్, అధిక ఉష్ణోగ్రతలు బీర్ల అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్