Wednesday, 23 September 2020

మోహినీ అవతారంలో మలయప్ప.. మోహపరవశంలో భక్తజనం...


శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌‌వారం ఉదయం 9 గంట‌లకు  శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.
మోహినీ అవతారం – మాయా మోహ నాశ‌నం      
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.
కాగా నేటి రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షించనున్నారు.
గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీమ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా.నిశ్చిత‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment